ప్రతిబిడ్డకు అమ్మఒడి ,శ్రీరామరక్ష-సిఎం జగన్.
ప్రతిబిడ్డకు అమ్మఒడి శ్రీరామరక్ష-సిఎం జగన్
నవరత్నాల హామీల్లో అత్యంత కీలకమైన ‘జగనన్న అమ్మ ఒడి’ రెండో ఏడాది చెల్లింపులను నెల్లూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదవాలన్నదే లక్ష్యమని తెలిపారు. అమ్మఒడి పథకం ద్వారా 45 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతి బిడ్డకు అమ్మఒడి శ్రీరామరక్ష అని, 19 నెలల పాలనలో చదువుల విప్లవం తీసుకొచ్చామని సీఎం పేర్కొన్నారు.
ఆ పరిస్థితులను పాదయాత్రలో చూశా..
‘‘చదివించే స్తోమత లేక తమ పిల్లలను కూలి పనులకు పంపించే పరిస్థితులను నా పాదయాత్రలో చూశా. అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపిస్తే రూ.15వేలు సాయం అందించాం. వరుసగా రెండో ఏడాది కూడా అమ్మఒడి పథకం అమలు చేస్తున్నాం. అమ్మఒడి రెండో విడత ద్వారా రూ.6,673 కోట్లు అందిస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. అదనంగా 4 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు అందజేస్తున్నాం. గోరుముద్ద పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని’’ సీఎం జగన్ చెప్పారు.
పరిస్థితులను మార్చేందుకే ‘నాడు-నేడు’
గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాయని, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పేరుతో దోపిడీ జరిగేదన్నారు. పరిస్థితులను మార్చేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. పాఠశాలకు విద్యార్ధి రాకపోతే మొదటి రోజు ఫోన్లో మెసేజ్.. వరుసగా రెండు రోజులు రాకుంటే వాలంటీర్ నేరుగా ఇంటికొచ్చి విద్యార్ధి యోగక్షేమాలు తెలుసుకుంటారని వెల్లడించారు.పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చే బాధ్యత తల్లిదండ్రుల కమిటీలతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు, వాలంటీర్లపై ఉందన్నారు. రాబోయే మూడేళ్లలో వంద శాతం పిల్లలు బడిబాట పట్టేలా చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. పాఠశాలల్లో టాయిలెట్లు శుభ్రంగా లేకపోతే 1902 నంబర్కు ఫోన్ చేయొచ్చని, గ్రామ సచివాలయాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని సీఎం సూచించారు.
అమ్మఒడి పథకంలో వినూత్నమైన మార్పు..
అమ్మఒడి పథకానికి టెక్నాలజీని సీఎం అనుసంధానం చేశారు. విద్యార్ధులకు కంప్యూటర్ స్కిల్స్ పెంచేందుకు ల్యాప్టాప్ ఆఫర్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి 9 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు ఈ ఆఫర్ ప్రకటించారు. అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్టాప్ ఇస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్డిస్క్, విండోస్ 10 ఓఎస్ ఫీచర్స్తో ల్యాప్టాప్ ఉంటుందన్నారు.
అంతకు ముందు శ్రీవేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన `అమ్మఒడి` పథకం ప్రారంభోత్సవ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఓ చిన్నారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. పాదయాత్రలో చెప్పిన ప్రతిమాటను అక్షరాలా చేసి చూపిస్తున్న సీఎం జగన్ వరుసగా రెండో ఏడాది కూడా విజయవంతగా సంక్షేమపథకాలను అమలు చేస్తున్నారు.